Vijay Sethupathi: సెట్స్ పైకి పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి చిత్రం

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. సెట్స్‌లో తీసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. "మా అసలైన ప్రయాణం ఈరోజు హైదరాబాద్ సెట్‌లో మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం" అని చిత్రబృందం పేర్కొంది. విడుదల చేసిన ఫోటోలలో సంయుక్త మీనన్ లంగా ఓణీలో సంప్రదాయబద్ధంగా కనిపించి ఆకట్టుకున్నారు. నిర్మాత చార్మీ కౌర్ కూడా సెట్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేశారు.

పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో స్టార్ నటి టబు విలన్‌గా నటిస్తుండగా, శాండల్‌వుడ్ నటుడు దునియా విజయ్, రాధికా ఆప్టే ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Vijay Sethupathi
Puri Jagannadh
Samyuktha Menon
Puri Connects
Telugu cinema
Tollywood
Beggar movie
Charmee Kaur
Pan-India movie
Tabu

More Telugu News