ట్రంప్‌కు కోపం వస్తుందేమో... సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన పుతిన్!

  • ట్రంప్‌తో ఫోన్ కాల్.. సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన పుతిన్
  • ఆయన్ను వెయిట్ చేయిస్తే కోపం వస్తుందేమోనని వ్యాఖ్య
  • గతంలో ట్రంప్‌ను గంటకు పైగా వెయిట్ చేయించిన వైనం
  • ఇరు నేతల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని వెల్లడి
  • ఉక్రెయిన్‌పై తమ లక్ష్యాలు మారబోవని స్పష్టం చేసిన రష్యా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కార్యక్రమం నుంచి హడావుడిగా వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ను వేచి చూసేలా చేస్తే ఆయనకు కోపం రావచ్చని, అది ఇబ్బందికరమని పుతిన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

గురువారం మాస్కోలో జరిగిన ‘స్ట్రాంగ్ ఐడియాస్ ఫర్ ఏ న్యూ టైమ్’ ఫోరమ్‌లో పుతిన్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రసంగం మధ్యలోనే సభికులకు క్షమాపణలు చెప్పిన పుతిన్ "నన్ను క్షమించండి, నేను ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాల్సి ఉంది. ఆయన్ను వెయిట్ చేయించడం ఇబ్బందికరం, ఆయనకు కోపం రావొచ్చు" అని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, గతంలో ఇదే పుతిన్.. ట్రంప్‌ను గంటకు పైగా వేచి చూసేలా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మార్చి నెలలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్‌తో ఫోన్ కాల్ సమయం మించిపోతున్నా పుతిన్ నింపాదిగా వ్యవహరించారు. తన అధికార ప్రతినిధి మాటలను పట్టించుకోవద్దని చమత్కరించి, గంట ఆలస్యంగా ట్రంప్‌తో మాట్లాడారు. కానీ, ఇప్పుడు ఆయన వైఖరిలో మార్పు రావడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరు నేతల మధ్య ఇది ఆరో ఫోన్ సంభాషణ. ఈ చర్చల్లో ఉక్రెయిన్ సంక్షోభంపై ఎలాంటి పురోగతి లభించలేదని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌పై తమ లక్ష్యాలు మారబోవని రష్యా స్పష్టం చేయగా, చర్చలు ఫలించలేదని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ సంభాషణలో ఇరాన్, మధ్యప్రాచ్య అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాల సరఫరాను నిలిపివేసిన నేపథ్యంలో ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News