దుబాయ్‌లో ఎయిర్‌పాడ్స్ పోగొట్టుకున్న యూట్యూబ‌ర్‌... ఏడాది తర్వాత పాకిస్థాన్‌లో లభ్యం!

  • 'ఫైండ్ మై' ఫీచర్‌తో ఏడాది త‌ర్వాత‌ లొకేషన్ గుర్తింపు
  • స్థానిక పోలీసుల చొరవతో ఎయిర్‌పాడ్స్ స్వాధీనం 
  • దుబాయ్‌లో ఓ భారతీయుడి వద్ద కొన్నట్టు వెల్లడించిన స్థానికుడు
  • పాక్ వెళ్లిన యూట్యూబర్‌కు సెలబ్రిటీ తరహా స్వాగతం
టెక్నాలజీ సాయంతో అసాధ్యమ‌నుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతున్నాయి. పోయింద‌నుకున్న‌ ఓ విలువైన వస్తువు సరిగ్గా ఏడాది తర్వాత దేశం కాని దేశంలో దొరికితే కలిగే ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇలాంటి ఓ వింత అనుభవమే 'లార్డ్ మైల్స్'గా పేరొందిన బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ మైల్స్ రౌట్‌లెడ్జ్‌కు ఎదురైంది. దుబాయ్‌లో పోగొట్టుకున్న తన ఎయిర్‌పాడ్స్‌ను, అతను ఏడాది తర్వాత పాకిస్థాన్‌లో తిరిగి దక్కించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల మైల్స్ రౌట్‌లెడ్జ్ సుమారు ఏడాది క్రితం వీసా పనుల నిమిత్తం దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బస చేశాడు. ఆ సమయంలో హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేసిన తర్వాత తన యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో కనిపించకుండా పోయినట్లు అతడు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు. అయితే, అంతటితో ఆ కథ ముగిసిపోలేదు. తన ఎయిర్‌పాడ్స్‌కు 'ఫైండ్ మై' ఫీచర్‌ను ఎనేబుల్ చేసి ఉంచడంతో, పోయిన చాలా కాలం తర్వాత కూడా వాటి లొకేషన్‌ను ట్రాక్ చేయగలిగాడు.

అనూహ్యంగా ఆ ఎయిర్‌పాడ్స్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న జీలం నగరంలో యాక్టివ్‌గా ఉన్నట్లు సిగ్నల్ చూపించింది. ఆ సిగ్నల్ కూడా అక్కడి 'సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అనే స్థానిక భోజనశాల సమీపం నుంచి రావడంతో ఎలాగైనా వాటిని తిరిగి సంపాదించాలని నిశ్చయించుకున్న రౌట్‌లెడ్జ్, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు జీలం నగర పోలీసులను సంప్రదించాడు.

అతని పోస్టులు వైరల్ కావడంతో స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన స్థానికులపై దృష్టి సారించి, చివరకు ఓ వ్యక్తి వద్ద ఎయిర్‌పాడ్స్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి, తాను దుబాయ్‌లో ఓ భారతీయుడి వద్ద వాటిని కొనుగోలు చేశానని, అవి దొంగిలించినవని తనకు తెలియదని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో దొంగిలించిన వస్తువులను విక్రయించిన నేరం కింద పోలీసులు అసలు విక్రేతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తన ఎయిర్‌పాడ్స్‌ను తిరిగి తీసుకోవడానికి రౌట్‌లెడ్జ్ పాకిస్థాన్‌ వెళ్లాడు. అక్కడ జీలం పోలీసులు అతడికి సెలబ్రిటీ తరహాలో స్వాగతం పలకడం విశేషం. "నన్ను పోలీస్ చీఫ్‌తో పాటు 20 మందికి పైగా జర్నలిస్టులు కలిశారు. ఈ విషయం ఇక్కడ జాతీయ వార్తగా మారింది. రోడ్డుపై వెళ్తుంటే అపరిచితులు కూడా నన్ను గుర్తుపట్టి నా ఎయిర్‌పాడ్స్ గురించి అడుగుతున్నారు," అని రౌట్‌లెడ్జ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ కథలో అనుకోని విధంగా కీలకంగా మారిన అదే 'సెకండ్ వైఫ్ రెస్టారెంట్‌లో' పోలీసులు అతనికి ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు. టెక్నాలజీ, ప్రయాణం, కాస్త హాస్యం కలగలిసిన ఈ విచిత్రమైన రికవరీ కథ ఇప్పుడు పాకిస్థాన్‌తో పాటు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


More Telugu News