భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 10,000 లంచం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన తహసీల్దార్

Tahsildar B Nagarjuna Caught Red Handed Taking Bribe for Land Registration
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అవినీతిపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఒక తహసీల్దార్, అటెండర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం రైతు నుంచి లంచం డిమాండ్ చేయడమే కాకుండా, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలంలో ఒక రైతు తన కుటుంబ సభ్యుల పేరిట 22 గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ పనిని పూర్తి చేయడానికి తలకొండపల్లి తహసీల్దార్‌గా పనిచేస్తున్న బి. నాగార్జున, అదే కార్యాలయంలోని అటెండర్ యాదగిరి కలిసి బాధితుడి నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేశారు.

అధికారుల తీరుతో విసిగిపోయిన బాధితుడు, నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించి తన గోడు వెళ్లబోసుకున్నారు. అతని ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ముందుగా అనుకున్న ప్రకారం, మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుదారుడు రూ.10,000 ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, తహసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: ఏసీబీ

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగినా, వేధించినా భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. బాధితులు తమ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB) లేదా అధికారిక వెబ్‌సైట్ (https://acb.telangana.gov.in) ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని అధికారులు వివరించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
Go Back to Shorts
Nagarjuna Talakondapalli
Telangana ACB
Talakondapalli Tahsildar
Bribery Case
Land Registration

More Telugu News