Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యాత్రికులు మృతి

Road Accident in Annamayya District Claims Three Lives
షార్ట్స్‌లో చూడండి
దైవ దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్తున్న యాత్రికుల వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఒక బృందం తిరుమల శ్రీవారి దర్శనానికి టెంపో వాహనంలో వచ్చింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వీరంతా తమ స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఓ లారీ వీరి టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు టెంపో నుజ్జునుజ్జయింది.

ఈ ఘటనలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్సుల ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మృతులను కర్ణాటకలోని బాగేపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. దైవ దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందంతో తిరుగు ప్రయాణమైన వారి కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Road Accident
Annamayya district road accident
Andhra Pradesh accident
Tirumala pilgrims
Karnataka pilgrims
Kurabalakota
Madanapalle
Accident death toll
AP road safety
chennamarri mitta

More Telugu News