Maharashtra Government: డిన్నర్‌లో వెండిప్లేట్లు.. ఒక్కో భోజనం ఖరీదు రూ. 5 వేలు.. మహారాష్ట్ర ప్రభుత్వ విందుపై విమర్శల వెల్లువ

Maharashtra Government Dinner Controversy Over Silver Plates
షార్ట్స్‌లో చూడండి
ముంబైలో జరిగిన పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం వివాదంలో చిక్కుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అతిథులకు వెండి పళ్లాల్లో భోజనాలు వడ్డించి, విలాసవంతమైన విందు ఇచ్చారని మహారాష్ట్ర కాంగ్రెస్, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  

ముంబైలోని విధాన భవన్ ప్రాంగణంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన ఈ రెండు రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 600 మంది అతిథులు హాజరయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 5,000 విలువైన భోజనాన్ని, రూ. 550 అద్దె చెల్లించి మరీ వెండి పళ్లాల్లో వడ్డించారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. మహారాష్ట్ర శాసనసభా పక్ష నేత విజయ్ వాడెట్టివార్ నాగ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం దాదాపు దివాలా అంచున ఉన్నప్పుడు, ముంబైలో అంచనాల కమిటీ సభ్యులకు వెండి పళ్లాల్లో భోజనం పెట్టాల్సిన అవసరం ఏముందని, ఇది పూర్తిగా దుబారా ఖర్చని విమర్శించారు. రైతుల రుణమాఫీలు నిలిపివేస్తున్నారని, బోనస్‌లు చెల్లించడం లేదని, అనేక సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కోతలు విధిస్తున్నారని, మరోవైపు ఇలాంటి విందులకు మాత్రం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ కూడా ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంచనాల కమిటీ ప్రతినిధులు ఒక్కొక్కరు రూ. 550 విలువైన వెండి పళ్లెంలో రూ. 5,000 భోజనం చేశారని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త కుంభార్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. 600 మంది అతిథుల కోసం మొత్తం రూ. 27 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజాధనం దారుణంగా దుర్వినియోగం అయిందని విమర్శించారు. 600 మంది అతిథులకు మొత్తం రూ. 27 లక్షలు ఖర్చు చేశారని, పొదుపు గురించి చెప్పే కమిటీయే ఇలా వృథా ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 

అయితే, ఈ విషయంతో సంబంధం ఉన్న కొన్ని వర్గాలు ‘ఇండియా టుడే’ టీవీకి తెలిపిన వివరాల ప్రకారం.. అతిథులకు వెండి పూత పూసిన పళ్లాల్లో భోజనం వడ్డించారని, కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా పూర్తిగా వెండి పళ్లాల్లో కాదని తెలిసింది. ఒక్కో ప్లేటు భోజనం ఖరీదు కూడా రూ. 4,000 కాదని, అంతకంటే తక్కువేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివాదంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.
Go Back to Shorts
Maharashtra Government
Parliament Estimates Committee
Mumbai
Om Birla
Vijay Wadettiwar
Harshvardhan Sapkal
Silver Plates
Government Spending
Maharashtra Congress
Political Controversy

More Telugu News