'నన్ను తాకితే 35 ముక్కలుగా నరుకుతా'.. తొలిరాత్రే భర్తకు నవవధువు షాక్!

  • ఉత్తరప్రదేశ్‌లో నవవధువు వింత ప్రవర్తన
  • తొలిరాత్రి భర్తను కత్తితో బెదిరించిన వైనం
  • మేనల్లుడితో ప్రేమ వ్యవహారమే కారణం
  • అవకాశం చూసి ప్రియుడితో కలిసి పరార్‌
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇష్టం లేని వివాహం ఓ నవవధువు జీవితంలో పెను తుఫాను సృష్టించింది. పెళ్లయిన తొలిరాత్రే భర్తను కత్తితో బెదిరించి, ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఉడాయించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్‌లో సోనమ్ రఘువంశీ అనే యువతి హనీమూన్‌లో భర్తను హత్య చేయించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్ అనే యువకుడికి సితార అనే యువతితో ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఎంతో సంతోషంగా కనిపించిన సితార, మొదటిరాత్రి గదిలో తన అసలు స్వరూపం చూపించింది. గదిలోకి వెళ్లిన వెంటనే కత్తి తీసి, "నన్ను తాకడానికి ప్రయత్నిస్తే 35 ముక్కలుగా నరికేస్తా" అంటూ భర్త నిషాద్‌ను తీవ్రంగా బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని స్పష్టం చేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే, తనను వేధిస్తున్నారంటూ మీ కుటుంబంపైనా తప్పుడు కేసులు పెడతానని కూడా భ‌ర్త‌ను హెచ్చరించింది.

ఈ అనూహ్య పరిణామంతో నిషాద్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజే వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితార తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కొంత మెత్తబడినట్లు నటించిన సితారను నిషాద్ తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 

సితార తీరుతో విసిగిపోయిన వరుడి కుటుంబ సభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన తరుణంలోనే సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లోంచి పారిపోయింది. పోలీసుల‌ విచారణలో అమన్ సితారకు వరుసకు మేనల్లుడు అవుతాడని తెలియడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న సితార, అమన్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 



More Telugu News