కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

  • 2021 నాటి కేసు కొట్టివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థన
  • చౌటుప్పల్ పీఎస్‌లో నమోదైన కేసుపై హైకోర్టులో విచారణ పూర్తి
  • జగదీశ్ రెడ్డి నుంచి మైక్ లాక్కున్నారని ఆరోపణ
  • చౌటుప్పల్ తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తీర్పు రిజర్వ్‌
  • తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన
తనపై 2021లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది.

2021లో జరిగిన ఒక బహిరంగ సభలో అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైక్‌ను లాక్కున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై చౌటుప్పల్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది.

ఈ కేసులో చౌటుప్పల్ పోలీసులు తమపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ, కేసును కొట్టివేయాలని రాజగోపాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా తమ వాదనలు సమర్పించారు.


More Telugu News

Komatireddy Raj Gopal Reddy Telangana High Court Choutuppal Police Station