కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలు నిజమే... కానీ!: శశి థరూర్

Shashi Tharoor Acknowledges Differences with Congress Leadership
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో తనకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవలే అమెరికా, బ్రెజిల్ తదితర ఐదు దేశాల్లో 'ఆపరేషన్ సిందూర్' దౌత్య కార్యక్రమంలో భాగంగా అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి కేరళ రాజధానికి తిరిగివచ్చిన థరూర్, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

"మీ మనసులో ఏ ప్రశ్నలున్నాయో నాకు తెలుసు, కానీ నేను వాటికిప్పుడు సమాధానం చెప్పదలచుకోలేదు. ఇటీవల మా సీనియర్ నాయకులు తెన్నల బాలకృష్ణ పిళ్ళై కన్నుమూశారు, నేను అక్కడికి వెళుతున్నాను" అని థరూర్ తొలుత అన్నారు. అనంతరం, "అవును, కాంగ్రెస్ నాయకత్వంతో నాకు అభిప్రాయ భేదాలున్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. కొన్ని విషయాలు బహిరంగంగానే ఉన్నాయి. నేను వారిని (నాయకత్వాన్ని) నేరుగా కలుస్తాను, వారు నన్ను నేరుగా అడిగితే సమాధానం కూడా చెబుతాను. నేనెక్కడికీ వెళ్లడం లేదు... నేను కాంగ్రెస్ వాదిని" అని ఆయన తేల్చిచెప్పారు.

గురువారం జరుగుతున్న కీలకమైన నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి ఎందుకు హాజరుకాలేదని అడిగిన ప్రశ్నకు, "నన్ను దానికి ఆహ్వానించలేదు" అని థరూర్ క్లుప్తంగా బదులిచ్చారు.

అయితే, థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో లోక్‌సభ సభ్యుడు రాజ్‌మోహన్ ఉన్నితన్ తీవ్రంగా స్పందించారు. "నిలంబూర్‌లో జరుగుతున్నది ఎవరి పెళ్లి కాదు ఆహ్వానించడానికి!" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. "కాంగ్రెస్ పార్టీలో నాయకులే ప్రచార కమిటీకి తమ లభ్యత గురించి తెలియజేస్తారు. ఏ నాయకుడు ఎక్కడ ప్రచారం చేయాలో కమిటీ నిర్ణయిస్తుంది. ఏ కాంగ్రెస్ నాయకుడికీ ఆహ్వానం పంపరు" అని ఉన్నితన్ తెలిపారు.

"కొంతకాలంగా ఆయన (థరూర్) మనసు ప్రధాని మోదీ దగ్గర, శరీరం కాంగ్రెస్ పార్టీలో ఉంది. తానెక్కడికి వెళుతున్నాడో థరూర్ కి తప్ప అందరికీ తెలుసు. తనకు తాను తప్ప మరెవరిపైనా ఆయనకు విధేయత లేదు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో ఎప్పుడూ మరిచిపోతుంటాడు" అని ఉన్నితన్ తీవ్ర విమర్శలు చేశారు.

గతంలో థరూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు 'ఆపరేషన్ సిందూర్' ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం, ప్రధాని నరేంద్ర మోదీని, ముఖ్యంగా సరిహద్దు తీవ్రవాదంపై ఆయన ప్రభుత్వ స్పందనను ప్రశంసించడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. పార్టీ ఆయనను అధికారికంగా నామినేట్ చేయనప్పటికీ థరూర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Go Back to Shorts
Shashi Tharoor
Congress Party
Kerala
Nilambur by-election
Rajmohan Unnithan
Operation Sindoor
Indian Politics
Narendra Modi
Congress leadership
Political differences

More Telugu News