మచిలీపట్నం పోర్టు అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి

  • మచిలీపట్నంలో వేగవంతంగా జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు
  • రూ.213.66 కోట్ల అదనపు పనులకు ఈపీసీ కమిటీ సిఫార్సు
  • అదనపు పనుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం
  • ఆదేశాలు జారీ చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడి శాఖ కార్యదర్శి వై యువరాజ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు ప్రమాణాలకు అనుగుణంగా అదనపు పనుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

రూ.213.66 కోట్ల అదనపు పనులకు ఈపీసీ కమిటీ సిఫార్సు చేయగా, ఏపీ మారిటైమ్ బోర్డు పనులు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు పెట్టుబడి శాఖ కార్యదర్శి వై. యువరాజ్ ఆదేశాలు జారీ చేశారు.

గ్రీన్ ఫీల్డ్ పోర్టులో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి మారిటైమ్ బోర్డు సీఈవో ప్రతిపాదనలు పంపారు. వీటిపై ఐఐటీ మద్రాస్ ద్వారా ప్రభుత్వం పరిశీలన జరిపింది. వారి సిఫార్సుల మేరకు ప్రభుత్వం అదనపు పనులు చేపట్టేందుకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

తాజా అనుమతులతో పోర్టులో ఎరువుల స్టాక్ యార్డ్, బొగ్గు స్టాక్ యార్డ్, గ్రానైట్ స్టాక్ యార్డ్, ఎడిబుల్ ఆయిల్, ఇతర వస్తువులు, కంటైనర్ స్టాక్ యార్డ్, ట్రాన్సిట్ షెడ్, రైలు, రోడ్డు నెట్ వర్క్ లలో అదనపు పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మారిటైమ్ బోర్డు సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. 


More Telugu News

Machilipatnam Port Andhra Pradesh Green Field Port Krishna District AP Maritime Board Port Construction Infrastructure Investment Department Y Yuvraj Port Development IIT Madras