హనీమూన్ హత్య కేసు: సోనమ్‌తో మేఘాలయలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేపట్టిన పోలీసులు!

  • మేఘాలయ హనీమూన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
  • నిందితులతో ఈస్ట్‌ కాశీ హిల్స్‌లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌
  • ప్రేమ వ్యవహారంతో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసుల విచారణ
  • నిందితుల పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు, నిజ నిర్ధారణపై దృష్టి
  • ప్రధాన నిందితురాలు సోనమ్‌ను రేపు కోర్టు ముందుకు హాజరు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, భార్య సోనమ్‌తో పాటు ఇతర నిందితులను పోలీసులు ఈస్ట్‌ కాశీ హిల్స్‌ ప్రాంతానికి తీసుకువెళ్లి, రాజా రఘువంశీ హత్య జరిగిన తీరును సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సోహ్రా ప్రాంతంలో ఈ ప్రక్రియను చేపట్టారు.

ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మేఘాలయ డీజీపీ నాంగ్రాంగ్‌ తెలిపారు. "వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్తపై అంతటి ద్వేషం ఎలా పెరిగిందనే అంశంపై ప్రధానంగా దృష్టి సారించాం. ఇప్పటివరకు ఇది కేవలం ప్రేమ వ్యవహారానికి సంబంధించిన హత్యగానే భావించాం. కానీ, దీని వెనుక మరిన్ని కారణాలు ఉండొచ్చనే కోణంలో దర్యాప్తును లోతుగా చేస్తున్నాం" అని ఆయన వివరించారు.

నిందితులు ఇస్తున్న వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడంతో, వాస్తవాలను ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. క్రైమ్‌సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయడం ద్వారా మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని, నిందితులను కచ్చితంగా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని వారు వెల్లడించారు. ప్రధాన నిందితురాలు సోనమ్‌ను రేపు న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు.


More Telugu News