Himanta Biswa Sarma: పాకిస్థాన్ అణుశక్తిగా మారడానికి కాంగ్రెస్సే కారణమని అస్సాం సీఎం హిమంత ఆరోపణ

Himanta Biswa Sarma blames Congress for Pakistan becoming nuclear power
  • 80వ దశకంలో పాక్ అణు కార్యక్రమాన్ని నిరోధించే అవకాశాన్ని కాంగ్రెస్ చేజార్చిందని విమర్శ
  • దీనివల్లే పాక్ 'అణు బ్లాక్‌మెయిల్'కు పాల్పడుతోందని హిమంత వ్యాఖ్య
  • ఇజ్రాయెల్ సాయం చేస్తామన్నా, ఇందిరాగాంధీ వెనకాడారని వెల్లడి
పాకిస్థాన్ అణ్వస్త్ర దేశంగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, 1980వ దశకంలో ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిలువరించే అవకాశాన్ని చేజార్చి చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. దీని ఫలితంగానే పాకిస్థాన్ నేటికీ 'అణు బ్లాక్‌మెయిల్'కు పాల్పడుతూ అంతర్జాతీయ జోక్యాన్ని అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.

"కాంగ్రెస్ చారిత్రక తప్పిదం: భారత్ ఎలా పాకిస్థాన్‌ను అణు దేశంగా మారేందుకు అనుమతించింది" అనే శీర్షికతో 'ఎక్స్'లో సుదీర్ఘ పోస్ట్ చేసిన హిమంత, నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని తప్పుబట్టారు. "అణ్వస్త్ర ముప్పును నిర్వీర్యం చేయడానికి నేటి దేశాలు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్న తరుణంలో, 1980లలో భారత్ విషాదకరమైన నిర్లిప్తత... ఏం జరిగి ఉండాల్సింది, ఏం జరగలేదు అనేదానికి ఒక హెచ్చరికగా మిగిలిపోయింది" అని ఆయన పేర్కొన్నారు.

ఆ సమయంలో పాకిస్థాన్‌లోని కహూటాలో యురేనియం శుద్ధి జరుగుతున్నట్లు 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) నిఘా వర్గాలు ధృవీకరించాయని తెలిపారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ గూఢచర్య సమాచారం నుంచి సంయుక్త దాడుల ప్రణాళిక వరకు సహాయం అందించడానికి ముందుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. కహూటాపై ముందస్తు దాడికి గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌ను కూడా ఎంపిక చేశారని, భారత సైన్యం కూడా ఇందుకు మద్దతు తెలిపిందని వివరించారు.

"ఈ ముప్పు వాస్తవరూపం దాల్చకముందే దాన్ని తుడిచిపెట్టే సామర్థ్యం, ఏకాభిప్రాయం భారత్‌కు ఉన్నాయి. అయినా చివరి నిమిషంలో, అంతర్జాతీయంగా ఎదురయ్యే పరిణామాలకు భయపడి ఇందిరా గాంధీ వెనుకాడారు" అని హిమంత ఆరోపించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గి, నిరోధం కంటే దౌత్యానికే ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రణాళికను పూర్తిగా పక్కన పెట్టారని ఆయన విమర్శించారు.

1988లో రాజీవ్ గాంధీ, పాకిస్థాన్ ప్రధాని బెనజీర్ భుట్టోతో ఒకరి అణు స్థావరాలపై మరొకరు దాడులు చేసుకోకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తుచేశారు. "దశాబ్దం తర్వాత, 1998లో పాకిస్థాన్ అణుపరీక్షలు నిర్వహించింది. దీంతో భారత్ ఖరీదైన అణ్వాయుధ పోటీలోకి లాగబడింది. అప్పటి నుంచి కార్గిల్ యుద్ధం, పరోక్ష ఉగ్రవాద యుద్ధాలు, సరిహద్దు దాడులు పాకిస్థాన్ అణు కవచం కిందే జరిగాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"ఈనాటికీ పాకిస్థాన్ తన బాధ్యతారహిత ప్రవర్తనను చట్టబద్ధం చేసుకోవడానికి, అంతర్జాతీయ చర్యలను నిరోధించడానికి అణు బ్లాక్‌మెయిల్‌ను ఉపయోగిస్తోంది" అని దుయ్యబట్టారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షమైన సీపీఐ(ఎం) కూడా తమ 2024 ఎన్నికల ప్రణాళికలో, అధికారంలోకి వస్తే భారత్ అణు నిరోధకాన్ని వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చిందని ఆయన ఆరోపించారు. "బలమైన నాయకత్వానికి దృఢ సంకల్పం, దూరదృష్టి అవసరమైన చోట, కాంగ్రెస్ హెచ్చరికలు, జాప్యాన్నే అందించింది. స్వల్పకాలిక దౌత్యపరమైన సౌలభ్యం కోసం భారతదేశ దీర్ఘకాలిక భద్రతను కాపాడుకునే చారిత్రక అవకాశాన్ని వృధా చేసుకున్నారు" అని హిమంత బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Himanta Biswa Sarma
Pakistan nuclear program
Congress party
Indira Gandhi
Rajiv Gandhi

More Telugu News