Falguni: నేను రూ.2 కోట్లు ఇస్తా, మా నాన్నను తిరిగి తీసుకురండి.. విమాన ప్రమాద బాధితురాలి ఆవేదన

Air India victims daughter offers 2 crore to get father back
  • అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాల శోకం
  • మృతుల గుర్తింపు కోసం బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాల సేకరణ
  • 48 నుంచి 72 గంటల్లో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి అంచనా
  • టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ టాటా గ్రూప్ రూ. కోటి పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిహారంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మీయులను కోల్పోయిన దు:ఖాన్ని పరిహారం తీర్చలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఫాల్గుణి అనే మహిళ స్పందిస్తూ.. "మా నాన్నను తిరిగి తీసుకువస్తే వారికి రెండు కోట్ల రూపాయలు ఇస్తాను. ఆయన ఎప్పుడూ ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించేవారు. ఆ పరిహారం మా నాన్నను తిరిగి తీసుకురాగలదా? మా అమ్మ అనారోగ్యంతో ఉంది, ఆమెకు నాన్న కావాలి. నాకు ఆయన ప్రేమ కావాలి," అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. శుక్రవారం ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తండ్రి కోసం ఆమె పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది.

మృతదేహాల గుర్తింపు కోసం బంధువులు డీఎన్ఏ నమూనాలు ఇస్తుండగా, బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సివిల్ ఆసుపత్రి అధికారులు శుక్రవారం నాటికి 219 మంది బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించినట్లు తెలిపారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. "చాలా మంది బంధువులు నమూనాలు అందించారు. మృతదేహాల అవశేషాల డీఎన్ఏ విశ్లేషణ కూడా జరుగుతోంది. డీఎన్ఏ సరిపోలిన తర్వాత గుర్తింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాం" అని ఓ అధికారి వివరించారు. ఈ డీఎన్ఏ విశ్లేషణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 48 నుంచి 72 గంటల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Falguni
Air India
Air India crash
Ahmedabad
DNA samples
Tata Group compensation
Plane accident India
Victim family
BJ Medical College
Civil Hospital

More Telugu News