మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత ఫోన్

Kavitha Kalvakuntla urges funds for Moharram to Minister Adluri Laxman Kumar
షార్ట్స్‌లో చూడండి
ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే మొహర్రం పండుగకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి పలు కీలక అంశాలపై చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

గత కేసీఆర్ ప్రభుత్వం 2023లో మొహర్రం నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించిందని కవిత గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొహర్రం కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆమె తెలిపారు. 2024లో మొహర్రం సందర్భంగా ఏనుగుపై ఊరేగింపు నిర్వహించుకునేందుకు ముస్లింల సంప్రదాయం ప్రకారం అనుమతి కోరితే, ప్రభుత్వం నిరాకరించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్య ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ఈ ఏడాది మొహర్రం ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, సంప్రదాయబద్ధంగా పండుగ జరిగేలా చూడాలని ఆమె మంత్రిని కోరారు.

ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన అంశాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. నిధుల విడుదల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, మొహర్రం పండుగను ముస్లింలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేస్తానని కవితకు మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Go Back to Shorts
Kavitha Kalvakuntla
Telangana
Moharram
Adluri Laxman Kumar
Muslim festival
BRS

More Telugu News