Laxman Singh: రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు: దిగ్విజయ్ సింగ్ సోదరుడిపై కాంగ్రెస్ వేటు! ఆరేళ్లు బహిష్కరణ

- దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్పై కాంగ్రెస్ చర్య
- రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలే కారణం
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద నిర్ణయం
- ఏప్రిల్ 24న లక్ష్మణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో లక్ష్మణ్ సింగ్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
లక్ష్మణ్ సింగ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. ఆయన ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, మూడు సార్లు శాసనసభ్యుడిగా సేవలందించారు. అయితే, గత కొంతకాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై తరచూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఇటీవలే షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలన్న నిర్ణయాన్ని ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం తీసుకుంది.
అసలేం జరిగిందంటే?
ఈ ఏడాది ఏప్రిల్ 24న పహల్గామ్ బాధితులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలకు పరిపక్వత లేదు. వారి అపరిపక్వ వైఖరి వల్లే దేశం పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాబర్ట్ వాద్రా స్వయంగా రాహుల్ గాంధీ బావమరిది. ఒక వర్గాన్ని రోడ్లపై ప్రార్థనలు చేసుకోనివ్వకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని అంటున్నారు. ఇలాంటి పిల్ల చేష్టలను ఎంతకాలం భరించాలి? రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత. ఆయన మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యారు" అని లక్ష్మణ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కార్యదర్శి తారిక్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. లక్ష్మణ్ సింగ్కు నోటీసులు జారీ చేస్తూ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్ నాయకత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఆయన అన్ని హద్దులు దాటారని అందులో పేర్కొన్నారు.