ఇష్టం లేదన్నా పెళ్లి చేస్తున్నారుగా నేనేం చేస్తానో చూస్తుండండి.. తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్
- హనీమూన్ మర్డర్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి
- రాజ్ కుశ్వాహాతో ప్రేమ విషయం తల్లికి చెప్పిన సోనమ్
- సోనమ్ ను బలవంతంగా పెళ్లికి ఒప్పించిన తల్లి
- తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించిన సోనమ్
‘నేను ఆ మనిషి (రాజా రఘువంశీ)ని ఏం చేస్తానో చూడండి. దాని పర్యవసానాలు మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది’ అంటూ సోనమ్ తన తల్లిని బెదిరించింది. అయినా తల్లి వినకపోవడంతో బలవంతంగా తాళి కట్టించుకున్న సోనమ్.. ఆ తర్వాత వారం రోజులకే రాజా రఘువంశీని హత్య చేయించింది. తాజాగా ఈ వివరాలను రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, ఇలా హత్య చేయిస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన సోనమ్ రఘువంశీ (24), రాజా రఘువంశీ (29)లకు మే 11న వివాహం జరిగింది. అయితే, తమ కుటుంబ వ్యాపారంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న రాజ్ కుష్వాహాతో సోనమ్కు అంతకుముందే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయాన్ని సోనమ్ తన తల్లికి చెప్పి, రాజాను పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అయినప్పటికీ, తల్లి ఆమె ప్రేమను వ్యతిరేకించింది. కుమార్తెకు నచ్చజెప్పి తమ కులానికి చెందిన రాజాతో పెళ్లి చేసింది.
పెళ్లయిన తర్వాత, మే 23న రాజా, సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ ఓ హోమ్స్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిద్దరూ అదృశ్యమయ్యారు. మొదట దంపతులు కనపడటం లేదని కేసు నమోదు కాగా, జూన్ 2న రాజా మృతదేహం లభించడంతో ఈ కేసు దారుణమైన మలుపు తిరిగింది. విచారణలో సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది.