Telangana Government: సినిమా షూటింగ్‌లకు ఇకపై సింగిల్ విండోలోనే అనుమతులు: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

Telangana Government to Offer Single Window Clearance for Film Shootings

  • హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ సిటీగా తీర్చిదిద్దేందుకు డీపీఆర్ తయారీకి ఆదేశం
  • సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో పద్ధతి 
  • థియేటర్లలో ఆహార పదార్థాల అధిక ధరల నియంత్రణకు చర్యలు
  • ఎఫ్డీసీకి కేటాయించిన భూముల ప్రస్తుత స్థితిపై నివేదిక కోరిన ఉపసంఘం
  • చిత్రపురి కాలనీ సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీతో తదుపరి భేటీ
  • ఈ నెల 14న ఘనంగా గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి సినీ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని అధికారులను కేబినెట్ ఉపసంఘం ఆదేశించింది. మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్‌బాబులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సినీరంగ ప్రముఖులు, అధికారులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించింది.

సింగిల్ విండోతో షూటింగ్ అనుమతులు

జాతీయ, అంతర్జాతీయ సినీ పరిశ్రమలను ఆకర్షించేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. సినిమా షూటింగ్‌లకు అవసరమైన పోలీస్, ఫైర్, మున్సిపాలిటీ వంటి వివిధ శాఖల అనుమతులన్నీ ఒకేచోట, సింగిల్ విండో పద్ధతిలో లభించేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో (ఎఫ్‌డీసీ) ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

థియేటర్లలో ధరల నియంత్రణ

సినిమా థియేటర్లలో తినుబండారాల ధరలను కచ్చితంగా నియంత్రించాలని ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

భూముల కేటాయింపు, చిత్రపురి కాలనీపై సమీక్ష

గతంలో ప్రభుత్వం ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన 50 ఎకరాల భూమిలో నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో వివరించాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులను కోరింది. అలాగే, సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీ సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీని తదుపరి సమావేశానికి పిలిపించాలని నిర్ణయించారు.

గద్దర్ ఫిలిం అవార్డుల నిర్వహణ

ఈ నెల 14న గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన ఫిలిం అవార్డుల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ కమిషనర్ హరీష్, డైరెక్టర్ కిశోర్‌ బాబు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Telangana Government
Hyderabad
film industry
single window clearance
Bhatti Vikramarka
  • Loading...

More Telugu News