అమెరికా ప్రవేశం హక్కు కాదు: భారతీయ విద్యార్థి ఉదంతంపై యూఎస్ ఎంబసీ స్పందన

  • భారతీయ యువకుడిపై అమెరికా అధికారుల తీరుపై యూఎస్ ఎంబసీ ప్రకటన
  • చట్టబద్ధ ప్రయాణికులను స్వాగతిస్తామన్న అమెరికా
  • అక్రమ చొరబాట్లు, వీసా దుర్వినియోగాన్ని సహించబోమని స్పష్టీకరణ
  • అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
  • నెవార్క్ ఘటనపై న్యూయార్క్ భారత కాన్సులేట్ వివరాల సేకరణ
అమెరికాలో ఒక భారతీయ యువకుడి పట్ల అక్కడి భద్రతా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. చట్టబద్ధంగా తమ దేశానికి వచ్చే ప్రయాణికులను స్వాగతిస్తామని, అయితే అక్రమ చొరబాట్లు, వీసాల దుర్వినియోగం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ అధికారిక 'ఎక్స్‌' ఖాతా ద్వారా ఈ ప్రకటన చేసింది. "చట్టబద్ధమైన ప్రయాణికులను అమెరికా ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది. అయినప్పటికీ, అమెరికాలోకి ప్రవేశం అనేది ఒక హక్కుగా పరిగణించరాదు. అక్రమ మార్గాల్లో దేశంలోకి ప్రవేశించడం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం, అమెరికా చట్టాలను అతిక్రమించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోం" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల అమెరికాలోని నెవార్క్‌ విమానాశ్రయంలో ఒక భారతీయ యువకుడిని భద్రతా సిబ్బంది నేలపై పడేసి, చేతులను వెనక్కి విరిచి కట్టేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కునాల్‌ జైన్‌ అనే నెటిజన్ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం కూడా వివరాలు సేకరిస్తున్నామని తెలిపింది. 


More Telugu News