ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు... ఏపీఎస్డీఎంఏ అప్ డేట్
- ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు
- గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
- 10 జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచన
- పలు జిల్లాల్లో రేపు 40-41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచన
ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు, అలాగే పెద్ద హోర్డింగ్ల వద్ద నిలబడరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
బుధవారం (జూన్ 11) వర్షసూచన
ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఆయన పేర్కొన్నారు.
అధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక
మరోవైపు, బుధవారం (జూన్ 11) విజయనగరం, పార్వతీపురంమన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. ఈ జిల్లాల ప్రజలు ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇలా రాష్ట్రంలో ఒకే సమయంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నందున, ప్రజలు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా రైతులు, వృద్ధులు, చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.