Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

Krishnam Rajus Remarks on Amaravati Women Taken Suo Moto by National Womens Commission

  • అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు
  • ఎన్‌సీడబ్ల్యూ సుమోటోగా కేసు నమోదు, డీజీపీకి లేఖ
  • మూడు రోజుల్లోగా చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • అమరావతి ఉద్యమంలో మహిళా రైతులది కీలక పాత్రన్న కమిషన్
  • మీడియా కథనాల ఆధారంగా ఎన్‌సీడబ్ల్యూ చర్యలు

అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానెల్‌ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న కమిషన్, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఒక లేఖ రాశారు.

అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్న మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు అనుచితంగా మాట్లాడారంటూ వచ్చిన ఆరోపణలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు ముందుండి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కమిషన్ గుర్తుచేసింది.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి వివిధ మీడియా మాధ్యమాల్లో ప్రసారమైన కథనాలను ఆధారంగా చేసుకుని, ఎన్‌సీడబ్ల్యూ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించినట్లు తెలుస్తోంది. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ, మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ తన లేఖలో ఆదేశించారు. 

కృష్ణంరాజు అమరావతిని 'వేశ్యల రాజధాని' అని వ్యాఖ్యానించడం తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. దీనికి సంబంధించిన కేసులో సాక్షి టీవీ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం తెలిసిందే.

Krishnam Raju
Amaravati
National Commission for Women
AP DGP
Sakshi Channel
Kommineni Srinivasa Rao
Andhra Pradesh
Women's rights
Defamatory comments
Vijay Rahatkar
  • Loading...

More Telugu News