ఏపీ పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కీలక నిర్ణయం

  • ఏపీ పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
  • సీఎం చంద్రబాబు ఛైర్మన్‌, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కో-ఛైర్మన్‌
  • 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన ప్రధాన లక్ష్యం
  • విశాఖలో టీసీఎస్ కేంద్రం, విమానయాన అభివృద్ధికి టాటాతో చర్చలు
  • అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్
  • రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపడంతో పాటు, ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఛైర్మన్‌గా, ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కో-ఛైర్మన్‌గా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 

స‌భ్యులుగా సీఐఐ డీజీ చంద్ర‌జీత్ బెన‌ర్జీ, అపోలో ఆసుప‌త్రి వైస్ ఛైర్‌ప‌ర్స‌న్ ప్రీతారెడ్డి, భార‌త్ బ‌యోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, ప్రొఫెస‌ర్ రాజ్‌రెడ్డి, సతీశ్ రెడ్డి, జీఎం రావు, ఎల్ అండ్ టీ ఛైర్మ‌న్ సుబ్ర‌మ‌ణ్య‌న్‌, టీవీఎస్ మోటార్ ఛైర్మ‌న్ వేణు శ్రీనివాస‌న్‌, సీఎస్ విజ‌యానంద్ ఉండ‌నున్నారు. 'స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధి టాస్క్‌ఫోర్స్‌'గా నామకరణం చేసిన ఈ బృందం.. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు వ్యూహరచన చేయనుంది.

ఈ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు సంబంధించి సీఎం చంద్రబాబు గ‌తేడాది ఆగస్టులో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం ప్రకటన చేశారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నది తమ ప్రభుత్వ దార్శనికత అని ఆయన అప్పుడు స్పష్టం చేశారు. 

ఈ లక్ష్య సాధనలో భాగంగా 2024 నవంబరులో ఈ టాస్క్‌ఫోర్స్‌ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాథమిక లక్ష్యాలు, దృష్టి సారించాల్సిన కీలక రంగాలపై చర్చించారు. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ఈ టాస్క్‌ఫోర్స్‌.. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తుంది.

మౌలిక సదుపాయాల కల్పన, నవ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు చేయూత, తయారీ రంగం అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే విశాఖలో టీసీఎస్ అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పడానికి, ఎయిర్ ఇండియా, విస్తారా విమానయాన సంస్థల ద్వారా రాష్ట్రంలో విమాన సేవలను మెరుగుపరచడానికి టాటా గ్రూపుతో భాగస్వామ్యం కుదుర్చుకునే అంశాలను కూడా ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది.


More Telugu News