ఫ్లాట్ లో మంటలు.. 8వ అంతస్తు నుంచి దూకిన కుటుంబం.. వీడియో ఇదిగో!

Yash Yadav Family Dies After Jumping From Burning Delhi Apartment
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారక ప్రాంతంలోని ఓ నివాస భవనంలో చెలరేగిన మంటలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీ నుంచి దూకిన తండ్రి, ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే.. ద్వారక సెక్టర్-13లోని షాపత్ సొసైటీ అనే రెసిడెన్షియల్ భవనంలోని 8, 9 అంతస్తుల్లో ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పెద్దయెత్తున వ్యాపించడంతో కిటికీల నుంచి దట్టమైన పొగలు, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎనిమిదవ అంతస్తులో ఉంటున్న యశ్ యాదవ్ (35), ఆయన ఇద్దరు పదేళ్ల పిల్లలు (ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. ఎనిమిదవ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ యశ్ తో పాటు ఆయన పిల్లలు ఇద్దరూ మరణించారని వైద్యులు తెలిపారు.

ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉండిపోయిన యశ్ యాదవ్ భార్య, పెద్ద కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అధికారులు వారిని ఐజీఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఐదు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్కై లిఫ్ట్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా షాపత్ సొసైటీలోని నివాసితులందరినీ ఖాళీ చేయించారు. తదుపరి ప్రమాదాలు జరగకుండా భవనానికి విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Yash Yadav
Delhi fire accident
Dwarka fire
Shaphat Society
building fire
India fire tragedy
apartment fire
fire rescue
Delhi news
fire death

More Telugu News