Shashi Tharoor: పాక్ లో డాక్టర్ అఫ్రీదీని తక్షణం విడుదల చేయాలి: శశి థరూర్

- బిన్ లాడెన్ను పట్టించిన డాక్టర్ షకీల్ అఫ్రీదీ విడుదలపై అమెరికా డిమాండ్
- అఫ్రీదీ విడుదల డిమాండ్కు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు
- పాకిస్థాన్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టిన థరూర్
- అఫ్రీదీని విడుదల చేస్తే 9/11, ముంబై బాధితులకు న్యాయం: థరూర్
- పాక్ సైన్యం తీరుపై థరూర్ పరోక్ష విమర్శలు
ప్రపంచాన్ని వణికించిన అల్ఖైదా ఉగ్రవాద సంస్థ అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ను హతమార్చేందుకు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి కీలక సమాచారం అందించి సాయపడిన పాకిస్థానీ వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీ పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్ అఫ్రీదీని తక్షణమే విడుదల చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ చేసిన డిమాండ్కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శశి థరూర్ శనివారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి వివరించేందుకు శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష కమిటీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన ఓ సమావేశంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్, డాక్టర్ షకీల్ అఫ్రీదీ నిర్బంధం విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన థరూర్, "బ్రాడ్ షెర్మన్ డిమాండ్ను మేము స్వాగతిస్తున్నాం. పాకిస్థాన్, బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించింది. ఆయన ఎక్కడ ఉన్నాడన్న రహస్యాన్ని బయటపెట్టాడన్న ఆరోపణలతో ఓ వైద్యుడిని అక్రమంగా అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేస్తోంది. ఒకవేళ ఆ వ్యక్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఉంటే, వారికి అవార్డులు, రివార్డులు దక్కేవి" అంటూ పాకిస్థాన్ వైఖరిని తప్పుబట్టారు. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిం మునీర్కు దేశ అత్యున్నత సైనిక హోదా అయిన ‘ఫీల్డ్ మార్షల్’గా పదోన్నతి కల్పించిన విషయాన్ని థరూర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
డాక్టర్ షకీల్ అఫ్రీదీని విడుదల చేయాలని పాకిస్థాన్ నాయకత్వానికి శశి థరూర్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అఫ్రీదీ విడుదలైతే, అది 9/11 నాటి, ముంబయి ఉగ్రదాడుల బాధితులకు న్యాయం చేకూర్చడంలో ఒక కీలక ముందడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అసలేం జరిగింది?
పాకిస్థాన్కు చెందిన వైద్యుడైన షకీల్ అఫ్రీదీ, ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలను సేకరించేందుకు సీఐఏ నిర్వహించిన నకిలీ పోలియో టీకా కార్యక్రమంలో పాలుపంచుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ సమాచారం ఆధారంగానే, 2011 మే నెలలో అమెరికా నేవీ సీల్స్ పాకిస్థాన్లోని అబొట్టాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ సమీపంలోని ఓ రహస్య స్థావరంలో నక్కిన ఒసామా బిన్ లాడెన్పై దాడి చేసి మట్టుబెట్టాయి.
ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి అఫ్రీదీ అందించిన సమాచారమే కారణమని భావించిన పాకిస్థాన్ నిఘా వర్గాలు, ఆయన్ను వెంటనే అరెస్టు చేశాయి. దేశద్రోహం ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు, 2012లో అఫ్రీదీకి 33 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఆయన విడుదల కోసం అమెరికా పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. తాజాగా శశి థరూర్ కూడా ఈ డిమాండ్కు గొంతు కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.