Kamakshi Devi: బెంగళూరు తొక్కిసలాట ఘటనలో తమిళనాడు స్కూల్ కరస్పాండెంట్ మృతి

Kamakshi Devi Dies in Bangalore Stampede at Chinnaswamy Stadium

  • తిరుప్పూర్‌కు చెందిన కామాక్షి దేవి మృతి
  • క్రికెటర్లను చూసేందుకు వెళ్లగా ప్రమాదం
  • కామాక్షి మృతికి కమల్‌హాసన్, ప్రేమలత సంతాపం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తమిళనాడు యువతి ప్రాణాలు కోల్పోయారు. క్రికెటర్లను చూసేందుకు వెళ్లిన ఆమె, జనసందోహంలో చిక్కుకుని కిందపడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. 

తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలై ప్రాంతానికి చెందిన ఆమెను కామాక్షిదేవి (28)గా గుర్తించారు. అవివాహిత అయిన ఆమె ఉడుమలైలోని వివేకానంద విద్యాలయ పాఠశాలకు కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు బెంగళూరులోని రామమూర్తినగర్‌లో నివసిస్తూ అమెజాన్‌ ఇండియా కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తున్నట్టు తెలిసింది. క్రికెటర్లను దగ్గర నుంచి చూడాలన్న ఆసక్తితో స్టేడియం వద్దకు వెళ్లిన ఆమె, ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. కామాక్షిదేవి మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఉడుమలైలోని ఆమె స్వగ్రామానికి తరలించారు.

ఈ విషాద ఘటనపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "బెంగళూరులో జరిగిన ఈ విషాద ఘటన అత్యంత బాధాకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.

డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. "18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ జట్టుకు దక్కిన విజయోత్సాహం కొనసాగకుండా ఇలాంటి దుర్ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది" అని ఆమె ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రేమలత తెలిపారు.

Kamakshi Devi
Bangalore stampede
Chinnaswamy Stadium
Tamil Nadu school correspondent
RCB victory celebration
Amazon India
Udumalai
Kamal Haasan
Premalatha Vijayakanth
  • Loading...

More Telugu News