Rajendra Prasad: ఇంకెప్పుడూ ఇలా మాట్లాడను: నటుడు రాజేంద్రప్రసాద్

- జరిగినదానికి బాధపడుతున్నాను
- అలీ కూడా సీరియస్ గా తీసుకోలేదు
- మేమంతా ఒక ఫ్యామిలీనే
- ఇకపై మర్యాద పూర్వకంగా మాట్లాడతానన్న రాజేంద్రప్రసాద్
ఒకటి రెండు రోజులుగా అటు ఇండస్ట్రీలోను .. ఇటు బయట కూడా రాజేంద్రప్రసాద్ గురించిన చర్చ నడుస్తోంది. మొన్న జరిగిన ఒక ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన తీరే అందుకు కారణం. ఆ ఈవెంటులో ఆయన ఒక వైపున రోజాపై .. మరో వైపున మురళీ మోహన్ పై .. ఇంకొక వైపున అలీపై నోరుపారేసుకోవడమే అందుకు కారణం.
ఈ విషయంపై అలీ సున్నితంగానే స్పందించినా, చాలామంది రాజేంద్రప్రసాద్ తీరును తప్పుబట్టారు. ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు పారేసుకోవడం ఎక్కువైపోయిందంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సుమన్ టీవీతో మాట్లాడారు.
"నా మాట తీరును 'అలీ' సీరియస్ గా తీసుకోలేదు .. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అతను చెప్పాడు కూడా. కానీ ఎవరో ఏదో ఉద్దేశంతో ఈ విషయాన్ని పెద్దది చేయాలనుకుంటే దానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేమంతా ఒకరికొకరం ఎంతో ప్రేమతో ఉంటాము. ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే మేము కలిసి ఇంతదూరం ప్రయాణం చేసే వాళ్లం కాదు గదా. అలీ మళ్లీ నాకు కాల్ చేసి .. జరిగింది మరిచిపొమ్మని చెప్పాడు. ఏదేమైనా జరిగినదానికి నేను చాలా హర్ట్ అయ్యాను" అని అన్నారు.
"జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఎవరినీ 'నువ్వు' అని సంభోదించను. ఇకపై ఎవరినైనా 'మీరు' అనే పిలుస్తాను. అలా పిలవడం నేను ఎన్టీఆర్ గారి దగ్గరే నేర్చుకున్నాను. నేను మాట ఇస్తున్నాను .. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకూ అందరినీ 'మీరు' అనే పిలుస్తాను. అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను" అని అన్నారు.