ఇరాన్‌లో అదృశ్యమైన భారత యువకులు సేఫ్.. దుండగుల చెర నుంచి కాపాడిన టెహ్రాన్ పోలీసులు

  • భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడి 
  • గత నెలలో అదృశ్యమైన ముగ్గురు భారత యువకులు
  • ఈ విషయంపై ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ దృష్టి
  • చట్టవ్యతిరేక మార్గాల్లో రావొద్దని ఇరాన్ ఎంబసీ సూచన
గత నెల ఇరాన్‌లో అదృశ్యమైన ముగ్గురు భారతీయ యువకుల ఆచూకీ లభించింది. దుండగుల చెరలో చిక్కుకున్న వారిని టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చినట్టు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనతో ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇరాన్ ఎంబసీ తెలిపిన వివరాల ప్రకారం.. అపహరణకు గురైన యువకుల కేసు ప్రస్తుతం ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కాన్సులర్ విభాగం పర్యవేక్షణలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ పురోగతిని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఇరాన్ ఎంబసీ స్పష్టం చేసింది.

ఉద్యోగాల ఆశతో మోసపూరిత వ్యక్తులు, గుర్తింపు లేని ఏజెన్సీల మాటలు నమ్మి, చట్టవ్యతిరేక మార్గాల్లో ఇతర దేశాలకు ప్రయాణించవద్దని ఈ సందర్భంగా ఇరాన్ రాయబార కార్యాలయం భారత యువతకు సూచించింది. ఇలాంటి అక్రమ ప్రయాణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యువకులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గాల ద్వారానే విదేశీ ప్రయాణాలు చేపట్టాలని సూచించింది.


More Telugu News