ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీ గెలుస్తుందన్న సెహ్వాగ్.. కానీ అసలు లాజిక్ వేరే!

  • ఐపీఎల్ 2025 ఫైనల్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • తాను మద్దతు తెలిపిన జట్టు ఓడిపోతుందని సెహ్వాగ్ సెంటిమెంట్
  • అందుకే ఈసారి ఫైనల్లో ఆర్సీబీ గెలుస్తుందని ప్రకటన
  • పంజాబ్ కింగ్స్‌తో నేడు ఆర్సీబీ టైటిల్ పోరు
  • ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఇరుజ‌ట్లు
ఐపీఎల్ 2025 తుది సమరానికి రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు నేడు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఆర్సీబీ గెలుస్తుందని జోస్యం చెప్పిన సెహ్వాగ్, దానికి ఓ వింత కారణాన్ని కూడా జతచేశాడు.

క్రిక్‌బజ్ చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ... "నా వరకు ఆర్సీబీనే గెలుస్తుంది. నేను నా పాత ఫార్ములాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను మద్దతు తెలిపిన జట్టు ఓటమి పాలవుతుంది. గతంలో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. క్వాలిఫైయర్-1లో పంజాబ్ కింగ్స్ కూడా ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక క్వాలిఫైయర్-2లో నేను ముంబైకి మద్దతిచ్చాను, ఆ జట్టు ఓడిపోయింది" అని సెహ్వాగ్ వివరించాడు. ఈ 'జింక్స్' సెంటిమెంట్ కేవలం ఐపీఎల్‌కే పరిమితం కాదని, భారత జట్టు విషయంలో కూడా ఇలాగే జరిగిందని ఆయన గుర్తు చేశాడు. 

ఇక‌, ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్ లభించనుంది. ఎందుకంటే ఆర్సీబీ కానీ, పీబీకేఎస్ కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. ఆర్సీబీ గతంలో మూడుసార్లు ఫైనల్స్ చేరినా కప్పును ముద్దాడలేకపోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌కు ముందు కేవలం ఒక్కసారి (2014లో) మాత్రమే ఫైనల్ ఆడింది.

ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే మూడుసార్లు తలపడ్డాయి. వీటిలో రెండుసార్లు ఆర్సీబీ విజయం సాధించగా, ఒకసారి పంజాబ్ కింగ్స్ గెలిచింది. ముల్లాన్‌పూర్ వేదిక‌గా జరిగిన క్వాలిఫైయర్-1లో కూడా ఆర్సీబీనే పంజాబ్‌ను ఓడించింది. అంతకుముందు బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలుపొందింది.

ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్ల విషయానికొస్తే... పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్‌పై అజేయంగా 87 పరుగులు చేసి జట్టును ఒంటిచెత్తో గెలిపించాడు. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటికే 600కు పైగా పరుగులు సాధించగా, బౌలింగ్‌లో జోష్ హేజిల్‌వుడ్ 21 వికెట్లతో రాణించాడు.


More Telugu News