కార్ల్ సన్ ను ఓడించిన గుకేశ్... ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు స్పందన

  • నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై విజయం సాధించిన  తెలుగు తేజం గుకేశ్ 
  • సోషల్ మీడియా వేదికగా గుకేశ్‌కు అభినందనల వెల్లువ
  • గుకేశ్ విజయం అతని ప్రతిభ, అంకితభావాన్ని తెలియచెబుతుందన్న ప్రధాని మోదీ
నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలో భాగంగా జరిగిన 6వ రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై తెలుగు తేజం గుకేశ్ అద్వితీయ విజయం సాధించాడు. ఈ చెస్ టోర్నమెంట్‌లో ఘన విజయం సాధించిన గుకేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

గుకేశ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. గుకేశ్ అసాధారణమైన, అత్యుత్తమ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2024లో గుకేశ్ విజయం అతని ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. గుకేశ్‌కు ఇలాంటి మరిన్ని అద్భుత విజయాలు లభించాలని ఆకాంక్షించారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుకేశ్‌కు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ఈ అద్భుత విజయం అతని ప్రతిభకు, ప్రశాంతతకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. భారత చెస్ క్రీడా రంగంలో గుకేశ్ విజయం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, వారు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే దిశగా ప్రోత్సహిస్తూనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. 


More Telugu News