రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ స్పందన

  • అలీపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు
  • ఆయన సరదాగా అన్నారన్న అలీ
  • కూతురి మరణంతో ఆయన బాధలో ఉన్నారని వెల్లడి
కమెడియన్ అలీని ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై తాజాగా అలీ స్పందిస్తూ, రాజేంద్రప్రసాద్‌ను వెనకేసుకురావడమే కాకుండా, మీడియాకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు.

వివరాల్లోకి వెళితే, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్, సహనటుడు అలీపై కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పించారు.

తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై కమెడియన్ అలీ స్పందించారు. "కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారికి మాట తూలింది. ఆయన సరదాగా అన్నారు. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు" అని అలీ అన్నారు. రాజేంద్రప్రసాద్ మంచి కళాకారుడని, ప్రస్తుతం ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారని కూడా అలీ చెప్పారు.

రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గతేడాది (2024 అక్టోబర్ 5న) మరణించిన విషయాన్ని అలీ గుర్తు చేశారు. "ఇటీవలి కాలంలో ఆయనకు అమ్మ లాంటి కూతురు చనిపోయింది. ఆయన భావోద్వేగ స్థితిలో ఉన్నారు. ఆయన మానసిక స్థితిని అందరూ అర్థం చేసుకోవాలి" అని కోరారు.


More Telugu News