బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న రోజర్ బిన్నీ.. కారణం ఇదే!

  • ముగింపు దశకు రోజర్ బిన్నీ పదవీ కాలం
  • వయోపరిమితి కారణంగా తప్పుకోనున్న వైనం
  • ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు తాత్కాలిక బాధ్యతలు
  • మూడు నెలల పాటు పదవిలో కొనసాగనున్న శుక్లా
  •  నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు ఆయనదే బాధ్యత
  • జులై 19న బిన్నీకి 70 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో ఈ మార్పు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ వయోపరిమితి కారణంగా త్వరలో పదవి నుంచి వైదొలగనుండగా, ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు. రోజర్ బిన్నీ ఈ ఏడాది జులై 19న తన 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీంతో నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవిలో కొనసాగే అర్హతను కోల్పోతారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు రాజీవ్ శుక్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని తెలిసింది.

ప్రస్తుతం బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా సుమారు మూడు నెలల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటారు. ఈ సమయంలో బోర్డు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు, నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేస్తారు.

రోజర్ బిన్నీ 2022లో సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ దిగ్గజ సీమర్ 27 టెస్టులు, 72 వన్డే మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో మొత్తం 124 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 1983లో భారత్ చరిత్రాత్మక ప్రపంచకప్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి భారత విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.


More Telugu News