Stock Market: అమ్మకాల ఒత్తిడి... నష్టాలతో ముగిసిన మార్కెట్లు

- ఆటో, మెటల్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
- 182 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 82 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, కొన్ని ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల బాట పట్టాయి. అయితే, ఆటో, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 81,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టంతో 24,750 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, సన్ఫార్మా, నెస్లే ఇండియా, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు ఎటర్నల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాలను ఆర్జించాయి.
ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.57 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.41 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,296 డాలర్ల వద్ద కొనసాగుతోంది.