మిస్ వరల్డ్ 2025 తుది పోరుకు సర్వం సిద్ధం.. సోనూ సూద్‌కు ప్రత్యేక పురస్కారం

  • రేపు సాయంత్రం హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా తుది పోటీలు
  • న్యాయనిర్ణేతలుగా సోనూ సూద్, మానుషి చిల్లర్, సుధారెడ్డి
  • మల్టీమీడియా ఛాలెంజ్‌లో నెగ్గి నలుగురు ఫైనల్స్‌కు అర్హత
  • బాలీవుడ్ తారల నృత్యాలతో కనువిందు చేయనున్న వేడుకలు
ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భాగ్యనగరం సర్వసన్నద్ధమైంది. మూడు వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. శనివారం, మే 31న సాయంత్రం 6 గంటలకు హైటెక్స్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

కళ్లు చెదిరేలా వేదిక.. తారల తళుకులు 
మిస్ వరల్డ్ ఫైనల్స్ కోసం ప్రధాన వేదికను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి వచ్చిన నిపుణులైన డిజైనర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇషాన్ ఖట్టర్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

న్యాయనిర్ణేతలుగా ప్రముఖులు 

ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది (హ్యుమానిటేరియన్) పురస్కారాన్ని అందించనుంది. ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డును ఈసారి సోనూ సూద్ అందుకోనుండటం విశేషం.

 ఫైనల్స్‌కు మల్టీమీడియా ఛాలెంజ్‌ విజేతలు 

 రెండు రోజుల క్రితం నిర్వహించిన "మల్టీమీడియా ఛాలెంజ్" పోటీల విజేతలను మిస్ వరల్డ్ సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది. ఈ ఛాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి నలుగురు సుందరీమణులు విజేతలుగా నిలిచారు. ఆసియా-ఓషియానియా నుంచి థాయ్‌లాండ్, యూరప్ నుంచి మాంటెనీగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా-కరేబియన్ దీవుల నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు గెలుపొందారు. ఈ విజయంతో వీరంతా ఫైనల్స్‌లో టాప్-40 జాబితాలో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. శనివారం జరిగే తుది పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News