నేడు రాజారెడ్డి శతజయంతి... సమాధి వద్ద నివాళి కార్యక్రమానికి దూరంగా జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి, వైసీపీ అధినేత జగన్ తాత రాజారెడ్డి శతజయంతి నేడు. ఈ సందర్భంగా పులివెందులలోని డిగ్రీ కాలేజీ రోడ్డు సమీపంలో ఉన్న రాజారెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల తదితరులు పాల్గొన్నారు. అనంతరం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో రాజారెడ్డి శతజయంతి కేకును కట్ చేసి అక్కడున్న వారందరికీ అందించారు. చర్చిలో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మరోవైపు తన తాత రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళి కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. ఈరోజు ఆయన తన తాత శతజయంతిని విజయవాడలోని నిర్మల శిశు భవన్ లో తన భార్య భారతితో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో పాటు జగన్ మేనత్త విమలారెడ్డి కూడా ఉన్నారు. పిల్లలతో కలిసి వీరు కేక్ కట్ చేశారు.


More Telugu News