52 ఎకరాలు పోగొట్టుకున్న తొలితరం హీరో!

  • తొలితరం రొమాంటిక్ హీరో నాగయ్య
  • అపారమైన కీర్తిప్రతిష్ఠలు 
  • విపరీతమైన దానధర్మాలు 
  • మితిమీరిన మంచితనం 
  • సాయం పొందినవారే తప్పించుకు తిరిగిన వైనం  
             

చిత్తూరు నాగయ్య గురించి తెలియనివాళ్లంటూ ఉండరు. తెలుగు తెరపై కథానాయకుడిగా వెలుగొందిన తొలితరం స్టార్ హీరో ఆయన. నటుడిగానే కాకుండా దర్శనిర్మాతగా.. సంగీత దర్శకుడిగా .. గాయకుడిగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అలాంటి ఆయన గురించి సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు, 'ట్రీ మీడియా' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

" చిత్తూరు నాగయ్య గారు తొలినాళ్లలో తెరపై రొమాంటిక్ హీరోగా కనిపించారు. ఆ తరువాత కాలంలో ఆయన భక్తి రసాత్మక చిత్రాలలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రేక్షకులను ఎంతో ప్రభావితం చేశారు. 'భక్త పోతన' .. 'యోగి వేమన' వంటి సినిమాలు ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. దాంతో ఆయన చుట్టూ ఉన్నవారు సొంతంగా సినిమాలు నిర్మించమని ఎగదోశారు. దాంతో ఆయన 'త్యాగయ్య' సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఆయనకి మంచి లాభాలు తెచ్చి పెట్టింది" అని అన్నారు. 

"నాగయ్య గారు ఆ సమయంలో మద్రాస్ లో 52 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆయన ఆఫీసులో సొంత కార్లు 9 ఉండేవి. ఆయనకి తెలిసినవాళ్లు ఆ కార్లను ఉపయోగించుకుంటూ ఉండేవారు. ఆయన ఆఫీసు ఒక అన్నదాన సత్రాన్ని తలపించేది. అడిగినవారికి లేదనకుండా దానధర్మాలు చేసేవారు. దాంతో ఎవరికి ఏ కష్టం వచ్చినా .. ఏ సాయం కావాలన్నా నాగయ్యగారి ఆఫీసుకి పరిగెత్తేవారు. ఆ సమయంలో ఆయన సొంత బ్యానర్లో 'భక్త రామదాసు' సినిమా నిర్మాణాన్ని తలపెట్టారు" అని చెప్పారు. 

'భక్త రామదాసు' సినిమాను పూర్తి చేయడానికి నాగయ్యగారు చాలా ఇబ్బందులు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ఆయన 52 ఎకరాలను అమ్ముకోవలసి వచ్చింది. ఇక ఈ సినిమా తీయడంతో పాటు, మంచితనంతో .. అమాయకత్వంతో నాగయ్యగారు మరికొన్ని పొరపాట్లు .. తప్పులు చేశారు. దాంతో ఆయన ఆస్తులన్నీ పోగొట్టుకుని చివరి రోజులలో చిన్న రూమ్ లో ఉండవలసి వచ్చింది. నాగయ్య గారికి దణ్ణాలు పెట్టినవారే ఆయనను తప్పించుకుని తిరిగారు" అని అన్నారు.




More Telugu News

Chittor V Nagaiah Chittoor Nagaiah Bhakta Ramadasu Telugu cinema Nandam Harischandra Rao Bhakta Potana Yogi Vemana Tyagayya movie Tollywood Movie producer