Omar Abdullah: ఉగ్రదాడి జరిగిన పహల్గామ్‌లో జమ్మూకశ్మీర్ కేబినెట్ భేటీ.. ఎందుకో వెల్లడించిన ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah Jammu Kashmir cabinet meets in Pahalgam after terror attack
షార్ట్స్‌లో చూడండి
ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏమాత్రం భయపడేది లేదని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఉగ్రదాడి జరిగిన పహల్గామ్‌లోనే తాజాగా ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దృఢ సంకల్పాన్ని చాటింది. తన నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వేసవి రాజధాని శ్రీనగర్ లేదా శీతాకాల రాజధాని జమ్ము వెలుపల జరగడం ఇదే మొదటిసారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా వెల్లడించారు.

గత ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని ప్రకృతి అందాలకు నెలవైన బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనతో పర్యాటకుల రాక గణనీయంగా తగ్గిపోయింది. దీంతో, ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు, వారిలో నెలకొన్న భయాందోళనలను దూరం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీడియాకు తెలిపారు.

"ప్రజల ధైర్యానికి మేం సెల్యూట్ చేస్తున్నాం. పర్యాటకాన్ని తిరిగి ప్రోత్సహించేందుకే పహల్గామ్ వచ్చాం. ఆ దిశగా మా చర్యలు కొనసాగుతాయి" అని ఆయన అన్నారు. పహల్గామ్ క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన దృశ్యాలను ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. "ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏ మాత్రం భయపడేదిలేదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చాం. జమ్ముకశ్మీర్‌ దృఢంగా నిలుస్తుంది" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Omar Abdullah
Jammu Kashmir
Pahalgam
Terrorist attack
Cabinet meeting
Tourism

More Telugu News