Shehbaz Sharif: భారత్ తో చర్చలకు మేం సిద్ధం.. పాక్ ప్రధాని ప్రతిపాదన

Shehbaz Sharif Ready for Talks with India on All Disputes
షార్ట్స్‌లో చూడండి
భారత్‌తో నెలకొన్న అన్ని వివాదాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. కశ్మీర్, ఉగ్రవాదం, జల వివాదాలు, వాణిజ్యం వంటి కీలక విషయాలపై చర్చించి, శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్న షరీఫ్, టెహ్రాన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పులు తీవ్రమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది వారాలకే పాక్ ప్రధాని నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. "కశ్మీర్, జల వివాదాలతో పాటు అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం. వాణిజ్యం, ఉగ్రవాద నిరోధంపై కూడా మా పొరుగు దేశంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం" అని షరీఫ్ పేర్కొన్నారు.

అయితే, పాకిస్థాన్‌తో చర్చలు కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) స్వాధీనంపై మాత్రమేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే స్పష్టం చేశారు. "ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో సాధ్యం కావు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవవు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలంటూ జరిగితే అవి కేవలం ఉగ్రవాదం, పీఓకేపై మాత్రమే జరుగుతాయని అంతర్జాతీయ సమాజానికి తెలియజేస్తున్నాను" అని మోదీ అన్నారు. కశ్మీర్ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని కూడా భారత్ అంగీకరించబోదని, ఇది పూర్తిగా ద్వైపాక్షిక అంశమని తేల్చిచెప్పింది.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ, భారత్ యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటే పాకిస్థాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. "కొన్ని రోజుల క్రితం మేం చేసినట్లే, వారు దూకుడుగా వ్యవహరిస్తే మా భూభాగాన్ని మేం కాపాడుకుంటాం. కానీ, నా శాంతి ప్రతిపాదనను వారు అంగీకరిస్తే, మేం నిజంగా శాంతిని కోరుకుంటున్నామని, చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపిస్తాం" అని ఆయన అన్నారు.
Go Back to Shorts
Shehbaz Sharif
Pakistan India talks
India Pakistan conflict
Kashmir issue
Terrorism
Water disputes
Trade relations
Narendra Modi
POK
Ceasefire agreement

More Telugu News