కవితపై వేటు... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ రావు... కేసీఆర్ పరిస్థితి జయలలిత మాదిరి తయారయింది: సామ రామ్మోహన్ రెడ్డి

  • కవితపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమయిందన్న సామ
  • అదే జరిగితే కవిత సొంత పార్టీ పెడుతుందని జోస్యం
  • కేసీఆర్ నిస్సహాయుడిగా మారిపోయారని వ్యాఖ్య
  • సొంతవారే కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తున్నారన్న సామ
  • కవిత చెప్పిన దెయ్యాలు కేటీఆర్, హరీశ్, సంతోష్ అని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖ, పార్టీలో నెలకొన్న విభేదాలు, రాబోయే పరిణామాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైందని, త్వరలోనే ఈ ప్రకటన వెలువడుతుందని జోస్యం చెప్పారు.

గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... కవిత లేఖ గురించి తాను పది రోజుల ముందే ప్రస్తావించానని గుర్తుచేశారు. ఆ లేఖలో పేర్కొన్న "దెయ్యాలు" మరెవరో కాదని, వారే సంతోష్ రావు, కేటీఆర్, హరీశ్ రావు అని ఆయన కుండబద్దలు కొట్టారు. కవితపై క్రమశిక్షణ చర్యగా సస్పెన్షన్ వేటు వేసేందుకు పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయం ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంతోష్ రావును నియమించే అవకాశాలున్నాయని కూడా ఆయన అంచనా వేశారు.

ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చివరి రోజుల్లా తయారైందని రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకవేళ కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, ఆమె సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కవితతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన కేటీఆర్‌కు కూడా లేదని ఆయన తెలిపారు. కేసీఆర్‌ను సొంత మనుషులే వెన్నుపోటు పొడుస్తున్నారని... కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నా కేసీఆర్ నిస్సహాయుడిగా మిగిలిపోయారని విమర్శించారు.

గతంలో పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడిన అనేక మందిపై కేసీఆర్ కఠిన చర్యలు తీసుకున్నారని, కానీ ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకునే స్థితిలో ఆయన లేరని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌తో కవిత భేటీ కాకుండా సంతోష్ రావు తరచూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేయాలి, ఎవరిని కలవాలి అనే విషయాలను కూడా సంతోష్ రావే నిర్దేశిస్తున్నారని అన్నారు. చివరగా, కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేల దగ్గర సంతోష్ రావు డబ్బులు వసూలు చేస్తున్నారని సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 


More Telugu News

Sama Rammohan Reddy BRS party Kavitha KCR Telangana Congress Santosh Rao KTR Harish Rao Telangana politics Jayalalitha