Seethakka: కవిత చెప్పిన ఆ దెయ్యం కేటీఆరే కావొచ్చు: మంత్రి సీతక్క

Seethakka Says KTR Could Be The Ghost Mentioned By Kavitha
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొడుతూ, ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు.

సచివాలయంలో మీడియాతో సీతక్క మాట్లాడుతూ, "సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయింది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం, ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని కేటీఆర్‌ను ఆమె సూటిగా ప్రశ్నించారు. గోబెల్స్ తరహా ప్రచారంలో కేటీఆర్‌ను మించిన వారు లేరని, ఆయనకు "గోబెల్స్ అవార్డు" ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

"అబద్ధాల పునాదుల మీదే బీఆర్ఎస్ పార్టీ నడుస్తోంది. గోబెల్స్‌ను కూడా కేటీఆర్ మించిపోయారు. కవిత చెప్పిన దెయ్యం బహుశా కేటీఆరే కావొచ్చు," అని సీతక్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి, అర్హత కేటీఆర్‌కు లేవని ఆమె అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు పొందడం కోసమే కేటీఆర్ పదేపదే ఈడీ ప్రస్తావన తెస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయనపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. యుద్ధంలో ట్రంప్ అనుసరించే నీతిని మోదీ అమలు చేస్తున్నారని, అబద్ధాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ పూర్తిగా విస్మరించారని మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై అనవసరమైన, తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. "మీకు నిజంగా నీతి, నిజాయితీ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలేశ్వరం అయిందో ప్రజలకు సమాధానం చెప్పండి" అని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు (నేషనల్ హెరాల్డ్ ఉద్దేశించి) సహాయం చేస్తే తప్పేంటని ప్రశ్నించిన ఆమె, "గులాబీ కూలీల" రూపంలో దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. 
Go Back to Shorts
Seethakka
KTR
Revanth Reddy
BRS Party
Telangana Congress
Kaleshwaram Project
Corruption allegations
Rahul Gandhi
ED Investigation
Political criticism

More Telugu News