Jhansi Reddy: అమెరికా పౌరసత్వంతో భూమి కొనుగోలు.. కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు

Jhansi Reddy High Court Issues Notices to Congress Leader Over Land Purchase with US Citizenship
  • పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి హైకోర్టు నోటీసులు
  • భర్త రాజేందర్ రెడ్డికి కూడా జారీ అయిన షోకాజ్ నోటీసు
  • వివాదాస్పద భూమి కొనుగోలు వ్యవహారంలో చిక్కులు
  • విదేశీ పౌరసత్వంతో వ్యవసాయ భూమి కొన్నారని ఆరోపణ
  • జూన్ 19లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒక కేసులో భాగంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీ రెడ్డి దంపతులు 2017లో సుమారు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అయితే, ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో ఈ భూ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విదేశీ పౌరసత్వం కలిగిన ఝాన్సీ రెడ్డి ఇక్కడ వ్యవసాయ భూమి ఎలా కొనుగోలు చేస్తారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్ వాదనల ప్రకారం, ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా పౌరసత్వం స్వీకరించారని, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం ఆమె వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా, తప్పుడు పత్రాలు సమర్పించి ఈ భూమిని దక్కించుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం కూడా జారీ చేశారని పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ పిటిషన్‌పై మే 1వ తేదీన జస్టిస్ సీవీ భాస్కరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజా విచారణలో... ఝాన్సీ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో, భూమి కొనుగోలు వ్యవహారంపై జూన్ 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆమెకు, ఆమె భర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారితో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్‌లకు కూడా న్యాయస్థానం నోటీసులు పంపింది.
Jhansi Reddy
Congress leader
Telangana High Court
Land Purchase
American citizenship
FEMA violations

More Telugu News