Jyoti Malhotra: ఆ డైరీలో పాకిస్థాన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న జ్యోతి మల్హోత్రా!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని పేజీలు పాకిస్తాన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని, అక్కడి పర్యటన అనుభవాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు.

హర్యానాలోని హిసార్, న్యూ అగర్సైన్ ఎక్స్‌టెన్షన్‌లో మే 16న జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నారు. అధికారిక రహస్యాల చట్టం, భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. గత రెండు వారాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయిన 12 మందిలో జ్యోతి మల్హోత్రా ఒకరు. ఉత్తర భారతదేశంలో పాకిస్తాన్‌కు సంబంధించిన ఓ గూఢచార నెట్‌వర్క్ చురుకుగా పనిచేస్తోందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

జ్యోతి మల్హోత్రాకు చెందిన 2012 క్యాలెండర్‌తో ఉన్న పాత డైరీలో పాకిస్తాన్ పర్యటన అనంతరం ఆమె రాసుకున్న కొన్ని విషయాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ పట్ల తనకున్న ఇష్టాన్ని ఆమె మాటల్లోనే డైరీలో పొందుపరిచారు. పర్యటన సందర్భంగా సేకరించిన సమాచారం, వ్యక్తిగత అనుభవాలను కూడా అందులో రాసుకున్నారు.

ఓ చోట ఆమె ఇలా రాశారు, "ఈ రోజు, పాకిస్తాన్‌లో పది రోజుల పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చాను. ఈ పది రోజుల్లో పాకిస్తాన్ ప్రజల నుంచి నాకు ఎంతో ప్రేమ లభించింది. మా సబ్‌స్క్రైబర్లు, స్నేహితులు కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. లాహోర్ చూడటానికి మాకు దొరికిన రెండు రోజులు సరిపోలేదు."

మరొక పేజీలో, "సరిహద్దుల మధ్య ఈ దూరాలు ఇంకెన్నాళ్లు ఉంటాయో నాకు తెలియదు. కానీ మనసుల్లోని బాధలు మాత్రం పోవాలి. మనమంతా ఒకే నేల, ఒకే మట్టికి చెందినవాళ్లం. ఒకవేళ వీడియోలో చెప్పని విషయాలు ఏమైనా ఉంటే, మొహమాటం లేకుండా కామెంట్స్‌లో అడగండి" అని పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ను "క్రేజీ, రంగులమయమైన దేశం" అని వర్ణించిన జ్యోతి, అక్కడి అనుభూతి మాటల్లో చెప్పలేనిదని రాశారు. పాకిస్తాన్ అధికారులకు ఓ విజ్ఞప్తి కూడా చేశారు. "భారతీయుల కోసం మరిన్ని గురుద్వారాలు, ఆలయాలు తెరవాలని, హిందువులు అక్కడికి సులువుగా వెళ్లేలా చూడాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అక్కడి ఆలయాలను కాపాడండి. 1947 విభజనలో విడిపోయిన తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతించండి. పాకిస్తాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదో క్రేజీ, రంగులమయమైన దేశం," అని డైరీలో రాసుకున్నారు.
Jyoti Malhotra
YouTuber Jyoti Malhotra
Travel With Jo
Pakistan
Espionage
NIA investigation
ISI
Spying
India Pakistan relations
Lahore

More Telugu News