ప్లేఆఫ్స్ వెళ్లేందుకు ముంబ‌యి, ఢిల్లీల‌కు అవ‌కాశాలు ఇలా..!

  • జీటీపై ఓట‌మితో డీసీకి ప్లేఆఫ్స్‌ అవ‌కాశాలు సంక్లిష్టం
  • ఒక బెర్త్ కోసం డీసీ, ఎంఐ పోటీ
  • రెండు జ‌ట్ల‌లో ముంబ‌యికే నాకౌట్ అవ‌కాశాలు ఎక్కువ
  • రేసులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కూడా 
  • ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ చేరిన గుజ‌రాత్‌, బెంగ‌ళూరు, పంజాబ్
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)పై భారీ విజయంతో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఈ ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అలాగే ఢిల్లీ ఓట‌మితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) కూడా ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి. ఈ మూడు జట్లు కూడా ఇప్పుడు టాప్-2 స్థానాల కోసం పోటీ ప‌డ‌నున్నాయి. 

గుజరాత్ టైటాన్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌ 2025 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా అవతరించింది. ప్ర‌స్తుతం జీటీ ఖాతాలో 18 పాయింట్లు ఉండ‌గా.. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటిలో కూడా టైటాన్స్ విజ‌యం సాధిస్తే 22 పాయింట్లకు చేరుకోగలదు. అప్పుడు శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజ‌రాత్ టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
డీసీపై జీటీ విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ కు చేరుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిస్తే వారు గరిష్టంగా 21 పాయింట్లను చేరుకోవచ్చు. అదే స‌మ‌యంలో గుజ‌రాత్ త‌న రెండు మ్యాచుల్లో ఒక‌టి ఓడిపోతే ఆర్‌సీబీకి టాప్-2లో నిలిచే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్
పీబీకేఎస్‌ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. వారు తమ తదుపరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే, ఆర్‌సీబీ లేదా జీటీ ఒక మ్యాచ్‌లో ఓడిపోతే శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు టాప్-2లో నిలిచే అవకాశం ఉంది.

ముంబ‌యి ఇండియన్స్
టాప్-4లో స్థానం సంపాదించాలంటే ముంబ‌యి మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలి. రెండు విజయాలు వారిని 18 పాయింట్లకు తీసుకెళతాయి. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు 12 మ్యాచుల్లో 14 పాయింట్ల‌తో ఉంది. ఎంఐ నెట్ ర‌న్‌రేట్ బాగుంది. క‌నుక ఒక మ్యాచ్ గెలిచినా ఆ జ‌ట్టుకు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు ఉంటాయి. అయితే, ఇది ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది.  

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌
జీటీ చేతిలో ఓటమితో ఇప్పుడు ఢిల్లీ ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను మ‌రింత సంక్లిష్టంగా మార్చుకుంది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు 12 మ్యాచుల్లో 13 పాయింట్ల‌తో ఐదో స్థానంలో ఉంది. మొద‌ట‌ ముంబ‌యితో మ్యాచ్ (ఈ నెల 21న‌)లో గెలవాలి. ఒక‌వేళ ఓడితే మాత్రం ఇంటిముఖం ప‌డుతుంది. అలాగే చివ‌రి మ్యాచ్‌లో పంజాబ్‌ను కూడా ఓడించాలి. అలాగే పంజాబ్ చేతిలో ముంబ‌యి త‌న ఆఖ‌రి మ్యాచ్‌లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు 17 పాయింట్ల‌తో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. 

లక్నో సూపర్ జెయింట్స్ కు అంత ఈజీ కాదు 
ప్లేఆఫ్ అర్హత విషయానికి వస్తే ఎల్ఎస్‌జీకి అంత ఈజీ కాదు. వారు తమ మిగిలిన మూడు మ్యాచ్‌లను త‌ప్ప‌క‌ గెలవాలి. అలాగే ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డి ల‌క్నో ప్లేఆఫ్స్ భ‌విత‌వ్యం తేలుతుంది. ప్ర‌స్తుతం ఎల్ఎస్‌జీ 11 మ్యాచుల్లో 10 పాయింట్ల‌తో ఏడో స్థానంలో ఉంది. ఇవాళ స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఇంటిదారి ప‌డుతుంది. ఒక‌వేళ గెలిస్తే, ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. 


More Telugu News