చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

  • చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో చెలరేగిన మంటలు 
  • భవనం మొదటి అంతస్తులో భారీగా ఎగసిపడ్డ అగ్నికీలలు 
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు
  • ఈ ఘ‌ట‌న‌పై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్ లో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున చార్మినార్‌ సమీపంలో ఉన్న గుల్జార్‌హౌస్‌లో మంటలు చెలరేగాయి. భవనం మొదటి అంతస్తులో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈఘటనలో చ‌నిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. 

ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల‌ను అభిషేక్‌ మోడీ (30), ఆరుషి జైన్‌ (17), హర్షలి గుప్తా (7), షీతల్‌ జైన్‌ (37), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్ని బాయి (72), ఇరాజ్‌ (2)లుగా గుర్తించారు. 

కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి ఆరా తీశారు. అధికారుల‌ను అడిగి ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంట‌నే ప్ర‌మాదాస్థ‌లికి వెళ్లాల‌ని ఆదేశించారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

పోలీస్, అగ్నిమాప‌క‌ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సందర్శించారు. బాధిత కుటుంబాల‌తో మాట్లాడి అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. 




More Telugu News