Rohit Sharma: వాంఖడేలో రోహిత్ ఎమోషనల్ స్పీచ్.. ఏడ్చేసిన హిట్మ్యాన్ అర్ధాంగి రితిక

- నిన్నటి నుంచి వాంఖడేలో అందుబాటులోకి వచ్చిన రోహిత్ శర్మ స్టాండ్
- నిన్న మహారాష్ట్ర సీఎం సహా పలువురు ప్రముఖుల సమక్షంలో రోహిత్ స్టాండ్ ప్రారంభం
- ఈ కార్యక్రమానికి అర్ధాంగి రితిక, తల్లిదండ్రులు, సహాచర క్రికెటర్లతో కలిసి హాజరైన హిట్మ్యాన్
- ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రోహిత్ భావోద్వేగం.. అది చూసి కన్నీళ్లు పెట్టిన రితిక
ముంబయిలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో నిన్నటి నుంచి రోహిత్ శర్మ స్టాండ్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత్తో పాటు ముంబయి క్రికెట్కు హిట్మ్యాన్ అందించిన సేవలకుగానూ ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంలో ఓ స్టాండ్కు అతడి పేరును పెట్టి గౌరవించింది.
శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో అతని పేరు మీద ఒక స్టాండ్ను ప్రారంభించి సత్కరించింది. ఇక, ఈ ప్రత్యేక కార్యక్రమానికి 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీల్లో టీమిండియాను నడిపించిన రోహిత్ శర్మ తన అర్ధాంగి రితికా సజ్దే, అతని తల్లిదండ్రులు, కొంతమంది ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఆటగాళ్లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హిట్మ్యాన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో భర్త ఎమోషనల్ స్పీచ్కు భార్య రితికా కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ రోహిత్ ప్రత్యేక క్షణాన్ని జరుపుకుంటుండగా ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.