Jagat: హైదరాబాద్‌లో ఘోరం.. 14 రోజుల పసికందును పొడిచి చంపిన కసాయి తండ్రి!

Brutal Murder of Infant in Hyderabad Shocks City
  • చిన్నారిని చంపి చెత్తకుప్పలో పడేసిన వైనం
  •  భార్య ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి
  •  నిందితుడు నేపాల్‌కు చెందిన వాచ్‌మన్  
హైదరాబాద్ నగరంలో సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే 14 రోజుల పసికందును అత్యంత కిరాతకంగా హతమార్చి, మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశాడు. ఈ విషాదకర సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 14 రోజుల క్రితమే అతడికి అమ్మాయి పుట్టింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జగత్ తన కుమార్తెను అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని టోలీచౌకిలోని చెత్తకుప్ప సమీపంలో పడేసినట్టు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ఈ దారుణాన్ని గమనించిన నిందితుడి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు జగత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే, ఇంతటి ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలను నిందితుడు ఇంకా వెల్లడించలేదని పోలీసులు పేర్కొన్నారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Jagat
Hyderabad infant murder
Golconda police station
Nepal national
infant death
murder case
Hyderabad crime
child murder
security guard
Tolichowki

More Telugu News