పోలీసుల విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్

  • రాంగ్ రూట్‌లో ప్రయాణం, పోలీసుతో దురుసు ప్రవర్తనపై కేసు
  • శ్రీనివాస్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నోటీసు జారీ
  • అవసరమైనప్పుడు కోర్టు విచారణకు రావాలని పోలీసుల సూచన
ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ తనపై నమోదైన కేసు విచారణకు గురువారం హైదరాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన వివరణ తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో బెల్లంకొండ శ్రీనివాస్ తన నివాసానికి వెళుతున్న క్రమంలో రాంగ్ రూట్‌లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారి ఆయన్ను అడ్డుకోగా, శ్రీనివాస్ ఆయనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్‌ను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఆయన కారును సీజ్ చేసి, తదుపరి విచారణకు అవసరమైనప్పుడు కోర్టుకు హాజరుకావాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసి పంపించారు.


More Telugu News