Chenab Bridge: చీనాబ్ నది వంతెనపై విజయవంతంగా ప్రత్యేక రైలు పరుగు

- జమ్ముకశ్మీర్లో కట్రా-కాజీగుండ్ సెక్షన్లో చీనాబ్ వంతెనపై రైలు ప్రయాణం
- భద్రతా బలగాలను గమ్యస్థానాలకు చేర్చిన రైలు
- కశ్మీర్కు దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే అనుసంధానం పెంచే కీలక వంతెన
జమ్ముకశ్మీర్లో రవాణా సౌకర్యాలు మెరుగుదలకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కట్రా-కాజీగుండ్ రైల్వే సెక్షన్లోని నూతనంగా నిర్మించిన చీనాబ్ వంతెనపై ప్రత్యేక రైలు విజయవంతంగా ప్రయోగాత్మక ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ పరిణామం కశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనుంది.
పర్వత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో ప్రయాణ వేగం పెంచే లక్ష్యంతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులో భాగంగా, కట్రా-కాజీగుండ్ సెక్షన్లో నిర్మించిన చీనాబ్ వంతెనపై ప్రత్యేక రైలును నడిపారు. ఈ రైలులో ప్రత్యేక భద్రతా బలగాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ రైలు రౌండ్ ట్రిప్ను విజయవంతంగా పూర్తి చేసింది. సరిహద్దుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ రైలు మార్గం అందుబాటులోకి రావడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ మార్గంలో అదనపు ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షూ శేఖర్ ఉపాధ్యాయ్ ధృవీకరించారు. చీనాబ్ వంతెన కశ్మీర్ను రైల్వే మార్గం ద్వారా మిగిలిన భారతదేశంతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కట్రా నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన ప్రత్యేక రైలు, తిరిగి సాయంత్రం 6 గంటలకు స్టేషన్కు చేరుకుంది. గత నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలు మార్గాన్ని ప్రారంభించాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన రద్దయింది. తాజాగా నడిపిన ఈ ప్రత్యేక రైలులో సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరుతున్న సైనికులు ప్రయాణించారు. జమ్ముకశ్మీర్కు పౌర విమాన సేవలు రద్దు కావడంతో, వారికి ఈ రైలు మార్గం ప్రత్యామ్నాయంగా మారింది. ప్రస్తుతం ఈ రైలు సేవలు కట్రా-కాజీగుండ్ మధ్య మాత్రమే అందుబాటులో ఉండగా, సాధారణంగా బారాముల్లా-కాజీగుండ్ వరకు రైళ్లు నడుస్తాయి.