కల్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి వ్యాఖ్యలు... షర్మిల ఫైర్

ఆపరేషన్ సిందూర్ లో ఎంతో కీలకంగా వ్యవహరించిన కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కున్వర్ విజయ్ షా చేసిన మతపరమైన, లైంగిక వివక్షాపూరిత వ్యాఖ్యలు అత్యంత అవమానకరమని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆయన నోరు జారిన మాటలు కావని, బీజేపీ మనస్తత్వంలో పేరుకుపోయిన కుళ్లుకు ఇది స్పష్టమైన నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఓ మహిళా ఆర్మీ అధికారిణిపై బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందించారు. "మంత్రి కున్వర్ విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన మతతత్వ, లైంగిక వివక్షాపూరిత దాడి కేవలం మాటల్లో పొరపాటు కాదు. ఇది బీజేపీ మనస్తత్వంలోని కుళ్లును ప్రతిబింబిస్తుంది. ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా చప్పట్లు కొట్టిన వారు ఈ విషయాన్ని మరింత ధృవపరిచారు" అని షర్మిల పేర్కొన్నారు. "మోదీ అండ్ కో గొప్పగా చెప్పుకునే 'కొత్త భారతదేశం' ఇదేనా? గౌరవనీయులైన మహిళా అధికారులను ఇంత నీచమైన మతోన్మాదంతో అవమానించడమేనా నవభారతం?" అని షర్మిల తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

ఇది విడిగా జరిగిన సంఘటన కాదని, బీజేపీ మౌలిక సిద్ధాంతమే మతపరమైన ధృవీకరణపై ఆధారపడి ఉందని షర్మిల ఆరోపించారు. "దేశభక్తి ముసుగులో విద్వేషాన్ని దాచిపెట్టి, మతతత్వ రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. కేవలం ఎన్నికల లబ్ధి కోసం భారతీయుల మధ్య విభజన రేఖలు గీస్తూ, మన సమాజపు సున్నితమైన నిర్మాణాన్ని అస్థిరపరుస్తున్నారు" అని ఆమె విమర్శించారు. 

దేశ ఐక్యతను దెబ్బతీస్తూ, మహిళలను అగౌరవపరుస్తూ, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తెస్తున్న ఇటువంటి వారిని భారతదేశం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని షర్మిల వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను కాలరాస్తూ, విద్వేషాన్ని వ్యాప్తి చేసే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.


More Telugu News