Shravan Rao: రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్‌రావు తాజాగా మరో కేసులో అరెస్టయ్యాడు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మంగళవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు.

గతంలో అఖండ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థకు శ్రవణ్‌రావు 6 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు, విచారణ నిమిత్తం హాజరుకావాల్సిందిగా శ్రవణ్‌రావుకు నోటీసులు జారీ చేశారు.

దీంతో మంగళవారం నాడు శ్రవణ్‌రావు సీసీఎస్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం, ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. శ్రవణ్‌రావును నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు తరలించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్‌రావు, ఇప్పుడు చీటింగ్ కేసులో అరెస్టు కావడం గమనార్హం.
Shravan Rao
Arrest
6 Crore Fraud Case
Phone Tapping Case
Central Crime Station
Cyber Crime
Financial Fraud

More Telugu News