Rajnath Singh: త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ భేటీ.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

- డ్రోన్ దాడిని ప్రధాని మోదీకి నివేదించిన రక్షణ మంత్రి రాజ్నాథ్
- పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రధాన మంత్రి
- రాజ్నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్
భారత్పై పాకిస్థాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. పాకిస్థాన్ నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగినట్లు సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు.
ఈ సమాచారం అందిన వెంటనే, ప్రధానమంత్రి మోదీ తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.
కాగా, పాకిస్థాన్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ము కశ్మీర్ తో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులకు సెలవులను రద్దు చేశాయి. అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని, అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.