Prakash Raj: ఇది కశ్మీర్పై జరిగిన దాడి.. మా రక్తం మరిగిపోతుంది: సినీనటుడు ప్రకాశ్ రాజ్

- పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించిన నటుడు ప్రకాశ్ రాజ్
- ఇది అమాయకులపైనే కాదు, కశ్మీర్పై జరిగిన దాడిగా అభివర్ణన
- నిజమైన కశ్మీరీలు హంతకులు కాదని, ఈ చర్య సిగ్గుచేటని వ్యాఖ్య
- బాధిత కుటుంబాలకు క్షమాపణ చెబుతూ... సంఘీభావం ప్రకటన
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుశ్చర్యతో తమ రక్తం మరిగిపోతోందని అన్నారు. ఈ దారుణ మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఓ సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. ఈ దాడి కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని, మొత్తం కశ్మీర్పై, కశ్మీరీల ఆతిథ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
ఈ ఘటన ప్రతి కశ్మీరీ హృదయాన్ని ముక్కలు చేసిందని, మాటలు రావడం లేదని ప్రకాశ్ రాజ్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. అంతులేని బాధతో ఈ పోస్ట్ రాస్తున్నట్లు పేర్కొన్నారు. "మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంగా కాల్చి చంపారు. మన ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితిని ఎదుర్కొన్నారు. ఈ అనాగరిక దాడి శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం, మన విశ్వాసాన్ని దెబ్బతీసే దుష్ట చర్య" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ దుశ్చర్యకు సిగ్గుపడుతున్నామని, తమ రక్తం మరిగిపోతోందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. "ఇలాంటివి జరిగిన ప్రతిసారి, అవమాన భారాన్ని మోయాల్సి వస్తోంది. దీన్ని అస్సలు క్షమించలేం. ఇది భయంకరమైన, పిరికిపంద చర్య" అని ఆయన అన్నారు. కశ్మీరీలు మౌనం వీడి, ఈ క్రూరమైన చర్యను ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
"ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచలేదు. ఇలాంటి చర్యలకు ఎలాంటి సమర్థన లేదు. ఇది కేవలం సిగ్గుపడాల్సిన అంశం" అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని, వారి చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసి, పిల్లలను అనాథలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కశ్మీర్ను ఆటస్థలంగానో, యుద్ధ క్షేత్రంగానో చూడవద్దని ఆయన హితవు పలికారు. అతిథులను గౌరవించే ప్రదేశం కశ్మీర్ అని గుర్తుచేశారు. చివరగా, దాడిలో బాధితులైన కుటుంబాల బాధ తమ అందరిదని పేర్కొంటూ వారికి సంఘీభావం ప్రకటించారు. "మీరు కశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు. కానీ, మేము దానిని కాపాడలేకపోయాం. అందుకు క్షమించమని అడుగుతున్నాం" అంటూ ప్రకాశ్ రాజ్ తన పోస్ట్ను ముగించారు.